నాసా ఇస్రో బంధం మరింత బలోపేతం
చందమామపై ఇల్లు, రోడ్లు, కరెంట్
స్పెషల్ రిపోర్ట్- అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా (NASA), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) సంయుక్తంగా వచ్చే సంవత్సరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు యాత్ర చేపట్టబోతన్నాయి. అర్టెమిస్ ప్రోగ్రామ్ కింద ఈ రెండు దేశాలు సంయుక్తంగా అద్భుత ప్రయోగాలు చేయనున్నాయని ఆమెరికాలోని నాసాలో కీలక బాధ్యతలు నిర్వహించిన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ భవ్యా లాల్ (Bhavya Lal) చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ యంత్రాంగంలో అంతరిక్ష విధాన నిర్ణయాల్లో భవ్య కీలక పాత్ర పోషించారు. చంద్రుడితో పాటు అంగారకుడు, తోకచుక్కలు, గ్రహశకలాలపై ఉమ్మడి పరిశోధనలకు ఉద్దేశించిన అర్టెమిస్ (Artemis) ఒప్పందం లోకి భారత్ ను ఆహ్వానించడంలో భవ్యా లాల్ కీలక పాత్ర పోషించారు.
ఆమెరికా సుమారు 50 ఏళ్ల కిందే చంద్రుడిపై జెండా పాతినా.. అది బుడిబుడి అడుగులేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత చాలా మంది వ్యోమగాములు వెళ్లి వచ్చినా చంద్రుడిపై అడుగుపెట్టి రావటానికే పరిమితం అయ్యారని చెప్పారు. సాంకేతికత విస్తరించిన వేళ, మానవాళి మరోసారి చందమామ వైపు తాజాగా దృష్టిసారిస్తోందని డాక్టర్ భవ్యా లాల్ అన్నారు. చంద్రయానాలకే కాకుండా, చంద్రుడిపై ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. అందరికంటే ముందు అమెరికా ఓ అడుగు ముందుకేసి ఏకంగా చంద్రుడిపై విద్యుత్ ఉత్పత్తికి, రోడ్లు, ఇళ్ల నిర్మాణాలకు కూడా ప్రణాళికలు సిద్దం చేస్తోందని డాక్టర్ భవ్యా లాల్ చెప్పారు.