EC

పోస్టల్‌ బ్యాలెట్లపై ఉత్తర్వులు జారీచేసిన ఎన్నికల సంఘం 

తెలంగాలో 80 ఏళ్లు దాటినవారికి ఇంటి నుంచే ఓటు

న్యూ ఢిల్లీ రిపోర్ట్- రానున్న నవంబర్, డిసెంబర్ లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటిదగ్గరే ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం (election commission of india) నిర్ణయించింది. ఇలా ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయాన్ని కోరుకున్నవారికి ముందస్తుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారాన్ని పంపింది. తెలంగాణలో (Telangana) ఈ యేడాది నవంబరి లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎవరు అర్హులన్న విషయమై ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్రానికి సమాచారం పంపింది. 80 ఏళ్లు దాటినవారితో పాటు దివ్యాంగులు, కేంద్ర బలగాల్లో పనిచేస్తున్నవారు, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, పోలింగు ఏజెంట్లు, ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇలా మొత్తం 11 రకాల వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఐతే 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు కోరుకుంటే ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఖరారయిన తరువాత పోస్టల్‌ బ్యాలెట్లను అధికారులు సిద్ధం చేస్తారు. ఇంటి నుంచి ఓటువేసే వారికి సంబంధించి ప్రత్యేక రంగులో బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందిస్తారు. ఇలా ఇంటినుంచే ఓటు హక్కు సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకున్న వారు లిఖిత పూర్వకంగా ఆ ప్రాంత ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల అధికారులు ఆయా ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే తెలంగాణలో నాగార్జునసాగర్‌, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ ప్రయత్నం ప్రయోజనకరంగా ఉండటంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ సంవత్సరం జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 80 ఏళ్లు దాటిన ఓటర్లు తెలంగాణలో 4,87,950 మంది ఉన్నారు.


Comment As:

Comment (0)