మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్ - కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
మహబూబ్ నగర్ రిపోర్ట్- బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు, అది పాడైపోయిందని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఛల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారని, కానీ ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్రెడ్డి అని అన్నారు. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావని కేసీఆర్ ను హెచ్చరించారు. పాలమూరులో అనేక ప్రాజెక్టులు చేపట్టామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. గత పదేళ్లుగా మహబూబ్ నగర్ జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా అని కేసీఆర్ ను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. పార్లమెంటులో నిద్రపోవడానికా బీఆర్ఎస్ కు ఓటు వేయాలి అని విమర్శించారు.