ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఈసీ
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీ రిపోర్ట్- తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబరు 7 నుంచి 30 వరకూ ఈ ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో పోలింగ్ జరుగుతుందని, డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయెల్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, ఛత్తీస్గఢ్ లో నవంబర్ 7, 17 తేదీల్లో, మిజోరంలో నవంబర్ 7న, మధ్యప్రదేశ్లో నవంబర్ 17న, రాజస్థాన్లో నవంబర్ 23న పోలింగ్ జరగనుంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి సుమారు 16 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు.
తెలంగాణ ఎన్నికల షెడ్యూలు వివరాలు...
నోటిఫికేషన్- నవంబరు 3
నామినేషన్ల తుదిగడువు- నవంబరు 10
నామినేషన్ల పరిశీలన- నవంబరు 13
ఉపసంహరణ- నవంబరు 15
పోలింగ్ తేదీ- నవంబరు 30
ఓట్ల లెక్కింపు- డిసెంబరు 3
ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీ- డిసెంబరు 5.