వివేకాలాగే నాపై గొడ్డలి వేటు వేస్తారా - చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం నాకు ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించింది

వివేకాలాగే నాపై గొడ్డలి వేటు వేస్తారా - చంద్రబాబు

తిరుపతి రిపోర్ట్- మాజీ మంత్రి వివేకానంద రెడ్డి  (YS Vivekananda Reddy) లాగా తనను కూడా చంపేస్తారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తనకు ఎన్‌ఎస్‌జీ (SPG) భద్రత కల్పించిందని, లేదంటే వివేకానందరెడ్డి తరహాలో తనపై కూడా గొడ్డలి వేటు వేసేవారేమో అని వ్యాఖ్యానించారు. ప్రాణాల విలువ తెలియని రాక్షసులు, మానవ మృగాలు, డబ్బులు తప్ప విలువలు తెలియని మనుషులు వీళ్లు.. అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. 

కుప్పం వస్తే నీ సంగతి తేలుస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని (Peddireddy Ramachandra Reddy) హెచ్చరించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ సవాల్‌ విసిరారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా పుంగనూరు (Punganur) మండలం భీమగానిపల్లె వద్ద శుక్రవారం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు. ఆ తరువాత పూతలపట్టులో (Puthalapattu) బహిరంగ సభలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవలేమని వైసీపీ నేతలకు అర్థమైపోయిందని చంద్రబాబు అన్నారు.

అంగళ్లు వస్తే చిల్లర మూకలు, పేటీఎం బ్యాచ్‌ ను పెట్టుకుని నన్ను అడ్డుకోవాలని పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్‌ రెడ్డి ప్రయత్నించాడని ఆరోపించారు. ఇక మంత్రి పెద్దిరెడ్డికి ఊడిగం చేస్తున్నావా అంటూ ఎస్పీ రిషాంత్‌ రెడ్డిపై (Rishanth Reddy IPS) చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతలు నిర్వహించాలని చెప్పిన ఆయన, రోడ్డు మీదకు వచ్చి నన్ను అడ్డుకుంటానని ప్రకటన చేస్తావా అని మండిపడ్డారు. తనను అడ్డుకున్న వాళ్లంతా పైకి వెళ్లిపోయారని వార్నింగ్ ఇచ్చారు.