ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స సక్సెస్..
హైదరాబాద్ కిమ్స్లో ఎన్టీఆర్ భుజానికి ఆర్థోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన 2-3 నెలల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆర్థోస్కోపిక్ సర్జరీ నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన పూర్తిగా కోలుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్య బృందం పేర్కొంది. ఇటీవల జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు.
అభిమానులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు
తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, తాను క్షేమంగా ఉన్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కిమ్స్లోని వైద్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్.. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు తనకు ఎంతో శక్తినిస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే తిరిగి కలుస్తానంటూ అభిమానులకు భరోసా ఇచ్చారు.
