బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్లో వరుసగా బ్యాంకులు బంద్
వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం, PLI, పెన్షన్ తదితర డిమాండ్లపై బ్యాంకు యూనియన్లు సెప్టెంబర్ 11, 28-30 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు సెప్టెంబర్లో వరుసగా అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడంతో పాటు పలు పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 11న ఒకరోజు సమ్మెతో పాటు.. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మరో మూడు రోజుల సమ్మెకు యూనియన్లు నిర్ణయించాయి.
సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మె
సెప్టెంబర్ 11 శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ 11న సమ్మె ప్రభావం.. వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకు శాఖల కార్యకలాపాలపై పడనుంది. సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకు సెలవు ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం మరింత పొడిగే అవకాశం ఉంది.
మళ్లీ సెప్టెంబర్ 28 నుంచి సమ్మె
ఇక సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మరోసారి మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు UFBU పిలుపునిచ్చింది. ఈ సమ్మె సెప్టెంబర్ 30తో ముగిసే అర్ధవార్షిక ఖాతాల ముగింపు సమయంలో రావడంతో బ్యాంకింగ్ రంగంపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.
ఐదు రోజుల పని విధానమే ప్రధాన డిమాండ్
బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడం. 2024లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో ఐదు రోజుల బ్యాంకింగ్ ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించిందని యూనియన్లు చెబుతున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని గంటలను రోజుకు 40 నిమిషాలు పెంచి.. వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలన్న ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని UFBU పేర్కొంది.
PLIపై అభ్యంతరం.. పెన్షన్ సమస్యల పరిష్కారం కోరుతూ
ఐదు రోజుల బ్యాంకింగ్తో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI)పై కూడా యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల మధ్య ప్రోత్సాహకాల విషయంలో అసమానతలు వస్తాయని యూనియన్లు వాదిస్తున్నాయి. అదే సమయంలో పెన్షన్ అప్డేషన్, పెన్షనర్లకు ఏకరీతి డీఏ విధానం, NPS పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానానికి మారే అవకాశం వంటి అంశాలనూ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె హెచ్చరిక
తమ డిమాండ్లపై ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాల నుంచి సానుకూల స్పందన రాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని UFBU హెచ్చరించింది. దీంతో సెప్టెంబర్ నుంచే బ్యాంకింగ్ సేవలపై వరుస ఆందోళనల ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
ఖాతాదారులు ముందే ప్లాన్ చేసుకోవాలి
వరుస సమ్మెల నేపథ్యంలో నగదు ఉపసంహరణ, చెక్కులు, డీడీలు, ఇతర బ్రాంచ్ ఆధారిత పనులు ఉన్న ఖాతాదారులు ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. అయితే డిజిటల్ బ్యాంకింగ్, UPI, ATM వంటి సేవలపై ప్రభావం ప్రతి సేవకు, ప్రతి బ్యాంకుకు ఒకే విధంగా ఉండకపోవచ్చు. సెప్టెంబర్లో వరుస సమ్మెలకు బ్యాంకు యూనియన్లు సిద్ధమవుతుండటంతో.. ఖాతాదారులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
